ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం 'టైమ్ వేస్ట్': డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:39 PM
ఇరాన్తో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేసిందన్న దానికి ప్రతీకారంగా, ఇరాన్పై అమెరికా భారీ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంకారా, జులై 8: ఇరాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక అవగాహన ఒప్పందం(MoU) కథ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ప్రస్తుతానికి చర్చలు కొనసాగించడానికి మాత్రం అనుమతిస్తానని ఆయన పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలతో.. ఇరాన్కు చెందిన రేవు పట్టణాలైన బందర్ అబ్బాస్, సిరిక్, అలాగే కెస్మ్ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా భారీ వైమానిక దాడులు జరిపిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మరోవైపు.. ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మినహాయింపు లైసెన్స్ను కూడా వాషింగ్టన్ రద్దు చేసింది. దీనికి ప్రతిచర్యగా బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా లక్ష్యాలపై ఇరాన్ ఎదురుదాడులకు దిగింది.
ట్రంప్ ఏమన్నారంటే?
టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న రెండు రోజుల నాటో(NATO) సదస్సు సందర్భంగా ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. కాల్పుల విరమణ స్థితిపై స్పందిస్తూ.. 'నా దృష్టిలో అయితే అంతా అయిపోయింది. ఇకపై వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలని నేను అనుకోవడం లేదు. వారితో చర్చలు జరపడం కాలయాపన మాత్రమే. వారు నీచులు. నీచులు అంటే ఏంటో మీకు తెలుసా? మానసిక రోగులు. వారిని నడిపించే నాయకులు కూడా మానసిక రోగులే. వారు అత్యంత క్రూరులు, హింసాత్మక ప్రవృత్తి గలవారు. వారి చేతికి గనుక అణ్వాయుధం చిక్కితే, వారు కచ్చితంగా దానిని వాడేస్తారు. అందుకే నా పరంగా ఈ ఒప్పందం ముగిసిపోయింది' అని ట్రంప్ అన్నారు.
అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చలు కొనసాగించవచ్చని, అయితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే దానిపై తనకు నమ్మకం లేదన్నారు. 'వారు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, కానీ వారు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను' అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..